Telugu Gateway
Telangana

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోం..ఎండీ సునీల్ శర్మ

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోం..ఎండీ సునీల్ శర్మ
X

తెలంగాణలో సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ సమ్మెకు గుడ్ బై చెప్పి విధుల్లో చేరతామని జెఏసీ ప్రకటించినా సర్కారు మాత్రం నో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు సమ్మెకు వెళ్ళి..ఇష్టం వచ్చినప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. లేబర్ కోర్టులో విషయం తేలే వరకూ సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సునీల్ శర్మ ప్రకటన యధాతథంగా..‘రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరు అయి..ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు.

కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు.

ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి ద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరుతున్నాను. అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టుకు కూడా తెలియ చేయడం జరుగుతుంది. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనంపాటించాలని కోరుతున్నాను.’ అంటూ ముగించారు.

Next Story
Share it