Telugu Gateway
Politics

రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
X

తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయాలు అన్నీ ఇప్పుడు సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ చుట్టూ తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. అవసరం అయితే కలసి పనిచేయటానికి కమలహాసన్, రజనీకాంత్ లు సిద్ధపడటంతో పరిస్థితి ఎలా మారుతుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఓ రకమైన వ్యాక్యూమ్ తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడింది. డీఎంకె మాత్రం అత్యంత శక్తివంతంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. ఏఐడీఎంకె ఎంత మేరకు తన పట్టు నిలుపుకుంటుంది అన్నది ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్న అంశం. ఈ తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 2021వ సంవత్సరంలో తమిళనాడు ప్రజలు పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారని తెలిపారు.

అవసరమైతే..తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రజనీకాంత్‌తో పొత్తుకు సిద్ధమని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్‌ రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి తదితర అంశాలపై స్పందించారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్నకు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటే ఎవరు సీఎం అవుతారన్న ప్రశ్నకు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సర్‌ప్రైజ్‌ ఉంటుందని వ్యాఖ్యానించారు. 2021 ఎన్నికల నాటికి రాజకీయాల్లో తన పాత్రపై సంకేతాలిస్తూ.. ‘2021లో తమిళనాడు ప్రజలు వందశాతం పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారు’ అని పేర్కొన్నారు.

Next Story
Share it