ప్రియాంకను చంపింది ‘ఆ నలుగురే’

పక్కా ప్లాన్ ప్రకారమే వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై నిందితులు అత్యాచారం చేసి..హత్య చేసినట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. ఆమెను చూడగానే అప్పటికే మద్యం సేవించి ఉన్న లారీ డ్రైవర్..ఇతర సిబ్బంది పథకం ప్రకారం ఆమె స్కూటీలో గాలి తీసి తాము అనుకున్న విధంగా వ్యవహరించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను శుక్రవారం రాత్రి సైబారాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపర్చారు.డప్రియాంకారెడ్డిని పక్కా పథకం ప్రకారమే ట్రాప్ చేసి అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. నిందితులు మహ్మద్ ఆరీఫ్ ఏ1 (26), శివ ఏ2 ( 20) నవీన్ ఏ3 (20) కేశవులు ఏ4 (20) కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. ‘ప్రియాంక స్కూటీని టోల్ప్లాజా పక్కన పార్క్ చేయడం ఈ నలుగురు చూశారు.
సాయంత్రం బైక్ తీసుకుపోవడానికి వస్తుందని మాటువేశారు. ఆమెపై ఎలానైనా అత్యాచారం జరపాలని పథకం రచించారు. శివ అనే వ్యక్తి దీనికి ప్రణాళికను రూపొందించారు. దానిలో భాగంగానే ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నవీన్ పంక్చర్ చేశాడు. ప్రియాంక బైక్ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నలుగురూ మద్యం సేవించి ఉన్నారు. స్కూటీ పంక్చర్ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఇదే అదనుగా తొలుత ఆమె దగ్గరకు ఆరీఫ్ వచ్చి బైక్ తీసుకున్నాడు. పంక్చర్ చేయిస్తా అని బైక్ను తీసుకుని శివను పంపించాడు. ఆ సమయంలోనే ప్రియాంక ఆమె సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది. అప్పటికీ సమయం రాత్రి 9:30. శివ కేవలం గాలి మాత్రమే కొట్టించాడు.
ఈ లోపు ఆరీఫ్, నవీన్, కేశవులు కలిసి ప్రియాంకను టోల్ప్లాజా పక్కనే ఉన్న.. నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కుని వెళ్లారు. ఆరీఫ్ ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టాడు. ఈలోపు శివ కూడా వచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. బుధవారం రాత్రి 10: 08 గంటలకు ఆమె చనిపోయింది. ప్రియాంక శవాన్ని 10:30కి లారీలో తీసుకుని వెళ్లారు. మధ్యలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి బాటిల్లో పెట్రోల్ తీసుకున్నారు. తెల్లవారుజూమున 2:30 గంటలకు చటాన్పల్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. రెండు గంటల తరువాత మరోసారి వచ్చి..శవం కాలిపోయిందా లేదా అనేది చూసుకున్నారు. అనంతరం వారంతా తిరిగి వెళ్లిపోయారు’ అని తెలిపారు. ప్రియాంక హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం’ అని తెలిపారు.



