జగన్ పాలనపై పవన్ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ ఆరు నెలల పాలనలో విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపులు, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నాలు జరిగాయని పేర్కొన్నారు. కూల్చివేతల పర్వానికి తెర తీసి తన పాలనలో విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. ఉద్దేశపూర్వకంగానే వరద నీటితో రాజకీయ క్రీడలు సాగించారు. ఇసుకను అందుబాటులో లేకుండా చేసి లక్షల మంది కార్మికుల కడుపులు కొట్టారు. కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా వ్యవస్థలను గందరగోళపరిచారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు నెలల తరబడి నిలిచిపోయాయి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పీపీఏల రద్దు వ్యవహారంపై జపాన్ రాయబారి తన అసంతృప్తిని బహిరంగపరిచారు. అమరావతి రాజధానిలో పనులు నిలిపివేయడంపై సింగపూర్ ప్రభుత్వం నిరసన తెలిపి వైదొలగింది. ఈ దుందుడుకు చర్యలతో ఇప్పుడిక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లు ఎదుర్కోవలసిందే. కక్ష సాధింపుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి సామాజిక అశాంతి రేపుతున్నారు. శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్త మొదలుకొని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వరకూ పోలీస్ వేధింపులు, కేసులు బనాయిస్తూ కక్ష సాధిస్తున్నారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికేయడం, వార్తా ఛానెళ్లు బ్యాన్ చేయడం, చట్టాల ముసుగులో జర్నలిస్టులకి సంకెళ్ళు వేయడం, దుర్గి మండలంలో ఊళ్ళకు ఊళ్ళు మగాళ్లు లేకుండా ఖాళీ చేయించడం, తమకు ఓటు వేయని ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, రహదారులు మూసేయడం,... సోషల్ మీడియాలో ఎవరు ఒక మాట అన్నా కేసులు పెట్టి వేధించడం, ఊళ్లలో భయానక వాతావరణం సృష్టించడం ఇవి కావా జగన్ రెడ్డి పాలనలో కక్ష సాధింపులకు ఆనవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మానసిక ఆందోళన నెలకొందని తెలిపారు. విలేజ్ వాలంటీర్లు అని 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపారు. ప్రభుత్వ విధానం వల్ల 1.65 లక్షల మందికిపైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ గాలిలో ఉంది. 90 వేల పైచిలుకు ఉన్న తెలుగు ఉపాధ్యాయుల్లో ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకొంటారు అనే భయాలు నెలకొన్నాయి.
పార్టీలను, వేరే కులాలని వేధిస్తుంటే స్థానిక వ్యాపారవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, పెట్టుబడులు ఆంధ్రాకి ఇక రావు.. తద్వారా ఉద్యోగావకాశాలు ఉండవు అనే నిస్సహాయత, మానసిక వేదననిరుద్యోగుల్లో నెలకొన్నాయి. వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా అనే అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు ఇస్తుందా? నవరత్నాలకు నిధులు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకు అవసరమైన డబ్బులు ఉన్నాయా? రెండున్నర లక్షల కోట్లపైన అప్పు ఉంది. పెట్టుబడులు లేవు... పెట్టుబడులు పెట్టినవారిని పంపేశారు. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది. ఆంగ్ల భాష బోధన అనే వాదనతో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నానికి శ్రీకారం చుట్టారు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకొందాం.’ అంటూ ముగించారు.



