Telugu Gateway
Politics

ప్రజాస్వామ్యంపై సర్జికల్ స్ట్రైక్..బిజెపి ఓటమి ఖాయం

ప్రజాస్వామ్యంపై సర్జికల్ స్ట్రైక్..బిజెపి ఓటమి ఖాయం
X

మహారాష్ట్రలో ఊహించని రీతిలో సాగిన రాజకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలు శనివారం నాడు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బిజెపి సర్కారు ఏర్పాటు చేసిన తీరు ప్రజాస్వామ్యంపై ఆ పార్టీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ అని ఉద్థవ్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం మెజారిటీ తమ గ్రూపుకే ఉందని..విశ్వాస పరీక్షలో బిజెపి ఓటమి పాలు కాకతప్పదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు సరిపడా సంఖ్యాబలం ఉందని పేర్కొన్నారు. ఫడ్నవిస్‌ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అజిత్‌ పవార్‌ను ఎన్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదని వ్యాఖ్యానించారు.

‘మా పార్టీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. మేం ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతునిచ్చారు. అయితే తెల్లవారేలోగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ఆరున్నరకు తెలిసింది. మా ఎమ్మెల్యేలలో కొంతమందితో అజిత్‌ పవార్‌ రాజ్‌ భవన్‌కు వెళ్లారు. ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. అక్కడున్న వాళ్లతో అజిత్‌ మాట్లాడిస్తున్నారు. బహుశా ఆయన వెంట 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటారు అంతే. అయితే వాళ్లంతా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బీజేపీ బల నిరూపణ చేసుకోలేదు. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు. సంయుక్త విలేకరుల సమావేశంలోనే రాజ్‌ భవన్‌కు వెళ్లిన కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పవార్ మీడియాతో మాట్లాడించారు. ‘ అజిత్‌ పవార్‌ ఫోన్‌ చేసి రాజ్‌ భవన్‌కు రమ్మంటే వెళ్లాం. అయితే అప్పటికే అక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడున్న వాతావరణంతో మేం షాక్‌కు గురయ్యాం.

మేం అజిత్‌ వెంట వెళ్లడం లేదు. మా మద్దతు శరద్‌ పవార్‌కే’ అని ముగ్గురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరిణామాలపై చర్చించేందుకు సాయంత్రం నాలుగన్నర గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో శరద్‌ పవార్‌ సమావేశం కానున్నారు. మహారాష్ట్ర తాజా పరిణామాలపై స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ అన్ని సిద్ధాంతాలను విస్మరించింది. పార్టీలను చీల్చి అధికారం చేపట్టిందని ధ్వజమెత్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కూడా ఆయన శత్రువులు వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తొలుత ఈవీఎంలతో ఆటలాడారు. ఇప్పుడు కొత్త ఆట మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇక ముందు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది’ అని మండిపడ్డారు.

Next Story
Share it