Telugu Gateway
Politics

గవర్నర్ పంపిన లేఖ చూపించండి

గవర్నర్ పంపిన లేఖ చూపించండి
X

మహా వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఈ అంశంపై నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేసింది. సోమవారానికి ఉదయానికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ పడ్నవీస్ కు పంపిన లేఖ...తమకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఫడ్నవీస్ గవర్నర్ కు అందజేసిన లేఖలను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవి చూసిన తర్వాత సోమవారం మహారాష్ట్రలో ఎప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించాలనే అంశంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవీస్ , అజిత్‌ పవార్‌లకు కూడా నోటీసులు జారీచేసింది. బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో పఢ్నవిస్‌ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎన్వీ రమణ, అశోక్‌ భూషన్‌, సంజీవ్‌ కన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సెలువు రోజైనా ఆదివారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

ఎన్సీపీ, శివసేన తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను సిబల్‌ ధర్మాసనానికి వివరించారు. మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని, గవర్నర్‌ నిర్ణయం చట్ట విరుద్ధమని అన్నారు. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, ఆ తరువాత మెజార్టీ గల మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ‘గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పక్షపాతంతో వ్యవహరించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. బీజేపీకి మెజారిటీ ఉన్నట్లు భావిస్తే.. ఆదివారం అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలి.

మెజార్టీ లేని ఫడ్నవీస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలి. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలి. కేంద్ర మంత్రిమండలి నిర్ణయం లేకుండా రాష్ట్రపతి పాలనను ఎలా ఎత్తివేస్తారని సిబల్‌ ప్రశ్నించారు. బీజేపీ తరుఫున ముకుల్‌ రోహత్గి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. మెజార్టీ గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఈ పిటీషన్ పై ఆదివారం నాడు అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు.

Next Story
Share it