Telugu Gateway
Telangana

ఆర్టీసీ సమ్మెపై సుప్రీం న్యాయమూర్తుల కమిటీ

ఆర్టీసీ సమ్మెపై సుప్రీం న్యాయమూర్తుల కమిటీ
X

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆర్టీసి సమ్మె విషయంలో ఇఫ్పటికే హైకోర్టు ప్రదాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ పలు సూచనలు చేసింది. కానీ వాటిపై సర్కారు ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. తాజాగా హైకోర్టు ఆర్టీసీ అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా?. లేదా అన్నది కీలకం కానుంది. ఒక వేళ దీనికి కూడా తెలంగాణ సర్కారు నో చెపితే అప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. సమ్మె చట్టవిరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తన వాదనలు వినిపించారు. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు... కాబట్టి ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘కొంత మంది సమ్మె ఇల్లీగల్ అని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో.. లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేము’ అని న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Next Story
Share it