ఆర్టీసీ ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

ఆర్టీసి సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసి ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ శుక్రవారం నాడు స్వయంగా హైకోర్టుకు హాజరై నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై హైకోర్తీటు వ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు తప్పులు లెక్కలతో నివేదిక ఇస్తారా? అని హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. పూర్తి వివరాలతో మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలా? లేదా తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవచ్చని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక సలహాదారుడు రమేష్ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై హైకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ. 644.51 కోట్లు రావాల్సి ఉండగా.. మొత్తం సొమ్మును చెల్లించినట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ. 1786.06 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
అయితే 2015 నుంచి 2017 మధ్య కాలంలో జీహెచ్ఎంసీ కేవలం రూ. 336 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కోర్టుకు వెల్లడించారు. మిగతా సొమ్మును చెల్లించేందుకు తమకు స్థోమత లేదని జీహెచ్ఎంసీ తెలిపినట్లు ఆర్టీసీ ఆఫిడవిట్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ నిబంధలు సెక్షన్ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ కోర్టుకు తెలిపింది. అందువల్లన జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని వివరించింది. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉందని, నిర్వహణ వ్యయం కారణంగానే నష్టం వాటిల్లుతోందని ఆఫిడవిట్లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5 నుంచి 30 తేదీ వరకు బస్సుల ద్వారా రూ. 78 కోట్లు అర్జించగా.. రూ. 160 కోట్ల వ్యయమైనట్లు తెలిపింది.



