టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేంద్రం షాకిచ్చింది. ఆయన అసలు భారతీయ పౌరుడే కాదని తేల్చిచెప్పింది. ధీంతో ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వం ప్రమాదంలో పడినట్లు అయింది. ఎప్పటి నుంచో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం నడుస్తూనే ఉంది. పలు మార్లు ఈ వ్యవహారం కోర్టుల ముందుకు కూడా వెళ్ళింది. తాజగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే రమేష్ మాత్రం కోర్టు ఆదేశాల అందిన తర్వాత న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు.