Telugu Gateway
Politics

ఎన్ని నమస్కరాలు పెట్టినా బాబును నమ్మరు

ఎన్ని నమస్కరాలు పెట్టినా బాబును నమ్మరు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబు ఎన్ని నమస్కారాలు పెట్టిన ప్రజలు ఆయన్ను నమ్మరని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి ఏమీ జరగలేదని.. కేవలం గేదెలు, గొర్రెలు మేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో సొంత ఇళ్ళు కట్టలేని వ్యక్తి ఇక రాజధానిని ఏమి నిర్మిస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో చంద్రబాబు అనేక మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధాని తరహాలో రాజధాని నిర్మిస్తామని అబద్దాలు చెప్పారన్నారు.

చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై రాళ్లు, చెప్పు వేయడానికి కిరాయి రౌడీలు అవసరమా.. ఎవరో కడుపు మండిన వాడు రాయి, చెప్పు వేసి ఉంటాడని దుయ్యబట్టారు. రాజధానిలో రైతులపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై అన్యాయంగా కేసులు పెట్టారని, అందుకే వాళ్లు కడుపు మంటతో నిరసన తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబు చూస్తున్నారని, కోడెల శివప్రసాద్‌రావు మరణం, ఇసుక విషయంలో కూడా ఇలానే చేశారని ఆయన విమర్శించారు. అమరావతిని చంద్రబాబు ఒక భ్రమరావతిగా మార్చాడని, రాజధానిలో వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అద్భుతమైన రాజధాని అయితే శాశ్వత బిల్డింగ్‌లు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు.

Next Story
Share it