రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కెసీఆర్ పాలన రాజరికానికి పరాకాష్టంగామారిందని ధ్వజమెత్తారు. నిర్భందాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసి సమ్మె విషయంలో మంత్రివర్గంలోనూ చీలిక వచ్చిందని అన్నారు. కెసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించింది 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రమే అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే అని స్పష్టం చేశారు. కేటీఆర్ నిజామాబాద్లో తన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ తాను మాత్రం హుజూర్నగర్లో తన అక్కను గెలిపించుకుంటానని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవన్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అభిప్రాయ బేధాలు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం నాడు కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు కేసీఆరే కారణమని ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్ వసూలు చేస్తోన్న కేసీఆర్.. ఎయిర్ బస్కు మాత్రం 1శాతం ట్యాక్స్ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.85 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ అనే అధికారం కేసీఆర్కు లేదని స్పష్టం చేశారు. కోర్టులతో ఆటలాడితే.. కేసీఆర్కు మొట్టికాయలు తప్పవన్నారు. ఉద్యమ నాయకులేవరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడం దారుణమన్నారు.