మోడీ విమానానికి పాక్ నో
మరోసారి తమ గగనతలం నుంచి భారత ప్రధాని నరేంద్రమోడీ విమానం వెళ్ళటానికి పాకిస్తాన్ నో చెప్పింది. మోడీ సౌదీ అరేబియా పర్యటన ను పురస్కరించుకుని భారత్ చేసిన వినతిని తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్కు తెలియజేయనున్నట్లు ఖురేషీ వెల్లడించారు.
మరోవైపు కాశ్మీరీలకు మద్దతుగా ఈరోజు పాక్ బ్లాక్డే నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. గత నెలలో మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐస్ల్యాండ్ పర్యటన సందర్భాల్లోనూ పాక్ ఇదే రీతిలో వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్ కొంతకాలం తర్వాత మళ్లీ తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్కు చెందిన విమానాలను రానీయకుండా తమ గగనతలాన్ని మరోసారి మూసివేసింది. దీని వల్ల పాక్ కు ఆర్ధికంగా నష్టం అయినా సరే ఈ వైఖరిని మాత్రం పాక్ మార్చుకోవటం లేదు.