Telugu Gateway
Telangana

తెలంగాణ ఐఏఎస్ లపై హైకోర్టు ఫైర్

తెలంగాణ ఐఏఎస్ లపై హైకోర్టు ఫైర్
X

సాక్ష్యాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి హైకోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్ లు కూడా కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఇదంతా తెలంగాణలో జరుగుతున్న డెంగీ మరణాలపై. బుధవారం నాడు ఈ కేసును విచారించిన హైకోర్టు సీఎస్ తో సహా అందరూ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏసీ గదుల్లో కూర్చుని కాగితాలపై రాస్తే సరిపోతుందా.? అమలు ఏది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం నాడు విచారణ సందర్బంగా కూడా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్‌ కుమార్‌ జోషి సహా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా మూసీ నది ప్రాంతాలను పరిశీలించాలని సీఎస్ తోపాటు అధికారులను ఆదేశించింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్‌లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా లు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

Next Story
Share it