హర్యానాలో కొలువుదీరిన కొత్త సర్కారు
అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న మహారాష్ట్రలో బిజెపి సర్కారు ఏర్పాటుకు బ్రేక్ లు పడ్డాయి. మిత్రపక్షం శివసేనే బిజెపికి చుక్కలు చూపిస్తోంది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా కు ఒప్పుకుంటేనే బిజెపికి మద్దతు అని శివసేన తేల్చిచెబుతోంది. బిజెపి మాత్రం రాతపూర్వక హామీకి ససేమిరా అంటోంది. హర్యానాలో కొత్త సర్కారు కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ సత్యదేవ్ ఖట్టర్తో ప్రమాణం చేయించారు. అనంతరం జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం నాడు రాజ్భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేజేపీ, శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ 46ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్మేకర్గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జేజేపీతో బీజేపీ అక్రమపొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.