Telugu Gateway
Telangana

ఆర్టీసి కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ

ఆర్టీసి కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ
X

ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినా కూడా సీఎం కెసీఆర్ మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పు చూపించటం లేదు. చర్చలకు ఆయన ఏ మాత్రం మొగ్గుచూపటం లేదు. అదే సమయంలో కార్మికులే స్వయంగా విలీన డిమాండ్ తప్పనిసరికాదని చెప్పినందున 21 డిమాండ్లను పరిశీలించి..నివేదిక ఇచ్చేందుకు ఆర్టీసికి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఈడీ)లతో కమిటీ వేయాలని ఆదేశించారు. ఈ కమిటీ కూడా రెండు రోజుల్లో తన నివేదికను ఎండీకి అందజేయనుంది. ఎండీ ఇదే విషయాలను హైకోర్టుకు నివేదిస్తారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో ఈ అంశంపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే తమ ప్రథమ అవసరం అని కూడా చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్ట బోమని చెప్పారు.

కార్మిక సంఘాల తరుఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఈడి. టి. వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఈడిలు ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ లు సభ్యులుగా కమిటి ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Next Story
Share it