Telugu Gateway
Politics

దసరా సెలవులు సంక్రాంతి వరకూ పొడిగిస్తారేమో!

దసరా సెలవులు సంక్రాంతి వరకూ పొడిగిస్తారేమో!
X

ఆర్టీసి సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులు సజావుగా నడుస్తుంటే పాఠాశాలలు..కాలేజీలకు సెలవులు ఎందుకు పొడిగించారని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సర్కారు వైఖరిని చూస్తుంటే... మళ్లీ బస్సులు సజావుగా నడిచే వరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తారేమో అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. అదే గనుక జరిగితే పాఠశాలలకు దసరాకు మొదలైన సెలవులు సంక్రాతి వరకు కొనగాగుతాయేమోనని ప్రభుత్వంపై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారన్నారు.

ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని అన్నారు. ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య కానీ... వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని విజయశాంతి పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణ త్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు.

Next Story
Share it