‘వాల్మీకి’కి ఆ రెండు చోట్లా బ్రేక్
వరుణ్ తేజ్ సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. మొదటి నుంచి సినిమా ‘టైటిల్’ విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. అయితే చిత్ర యూనిట్ కూడా ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు సాగింది. వాల్మీకి సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు.... ‘వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీకి, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.