Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి ఆధారాలు స్వీకరిస్తా

రేవంత్ రెడ్డి ఆధారాలు స్వీకరిస్తా
X

తెలంగాణలోని రాజకీయాలపై బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్ లో ఓనర్లు..కిరాయిదారుల పంచాయతీ నడుస్తుంటే..కాంగ్రెస్ లో పాత..కొత్త నేతల పంచాయతీ సాగుతోందని ఎద్దేవా చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీఆర్ఎస్ సర్కారు అవినీతికి సంబంధించి ఆయన ఇచ్చే ఆధారాలను స్వీకరిస్తానని తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు అవినీతికి సంబంధించిన ఆధారాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు అందజేస్తానని ఇటీవలే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. సింగరేణి కార్మికులు ఆశించింది 30 శాతం బోనస్ అయితే..తెలంగాణ ప్రభుత్వం మాత్రం 28 శాతం బోనస్ ఇచ్చి సరిపెట్టిందని లక్ష్మణ్‌ తప్పుబట్టారు. ప్రభుత్వం చేసిన అప్పులతో సింగరేణి సంస్థకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్టు.. తుపాకీ రాముడిలా సీఎం కేసీఆర్‌ మాటలు కోటలు దాటాయని ఎద్దేవా చేశారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలే కాదు మొత్తం రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల్లో నెట్టిందని ధ్వజమెత్తారు. సింగరేణిని అప్పుల ఊబిలో నెట్టారని, ప్రభుత్వమే సింగరేణిని ముంచెసిందని ఆరోపించారు.

సింగరేణిలో కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించలేక, బోనస్‌లు ఇవ్వలేక అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచి కార్మికుల శ్రమను సింగరేణి సంస్థ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయని మండిపడ్డారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు బకాయి పడిందని, బోనస్ డబ్బులు చెల్లించాలని అన్నా... ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేయాల్సిందేనని అన్నారు.

Next Story
Share it