Telugu Gateway
Politics

అమెరికాలో మోడీ హంగామా

అమెరికాలో మోడీ హంగామా
X

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో హంగామా సృష్టించారు. ‘హౌడీ మోడీ’ పేరుతో ఏర్పాటు చేసిన అట్టహాస కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా ఆహ్వానించి తన కార్యక్రమానికి విపరీతమైన హైప్ వచ్చేలా చేసుకున్నారు. భారత్ తోపాటు పలు దేశాలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనించాయి. అంతే కాదు..వచ్చే ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలవాలంటూ మోడీ హౌడీ మోడీ వేదికగా ఆకాక్షించారు. తనకు ట్రంప్ ఎంతో నమ్మకమైన మిత్రుడు అంటూ కొనియాడారు. తమ కృషి అంతా కొత్త భారత్ నిర్మాణం కోసమే అంటూ ప్రకటించారు. అంతే కాదు సరిహద్దు ఉగ్రవాదం విషయంలో కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమెరికాలోని హుస్టన్ లో జరిగిన సభ వేదికగా ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్‌ ట్రంప్‌ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు.

‘అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక, భారత్‌లో జరిగిన 26/11(ముంబై దాడులు) నరమేథం వెనుక కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగామన్నారు. భారత్, అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందన్న మోదీ.. వారి కోసం భారత్‌ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. భారత్, అమెరికాల దోస్తీ 21వ శతాబ్దంలో మరిన్ని ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్‌’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు ఇది రుజవని పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రసంగ సమయంలో ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్‌ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం.

టెక్సాస్‌ అంటే విశాలత్వం.. ఆ విశాలత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు 50 వేలకు పైగా ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇదో చరిత్ర. కొత్త చరిత్ర. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నెలకొన్న ఎనర్జీ. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, సమన్వయానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస. ఈ కార్యక్రమం పేరు ‘హౌడీ మోదీ’ అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది(భారత్‌ మే సబ్‌ అచ్చాహై). (అనంతరం తెలుగులో అంతా బావుంది సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోదీ ఉచ్ఛరించారు. దాంతో స్టేడియంలో మోదీ నినాదాలు మిన్నంటాయి.

Next Story
Share it