Telugu Gateway
Cinema

మహేష్ బాబు ‘రాజకీయం’బాగానే చేస్తున్నారే!

మహేష్ బాబు ‘రాజకీయం’బాగానే చేస్తున్నారే!
X

హీరో మహేష్ బాబు మాట్లాడితే తనకు రాజకీయాలు తెలియవని చెబుతుంటారు. అందరూ నిజమే కాబోలు అని నమ్మేస్తుంటారు. అదే సమయంలో బావ గల్లా జయదేవ్ ఎన్నికల బరిలో నిలిచినా కూడా ప్రచారానికి మాత్రం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చూస్తుంటే మహేష్ బాబుకు ‘రాజకీయం’ బాగానే వంట పట్టినట్లు కన్పిస్తోంది. తెలంగాణ అంతటా..ముఖ్యంగా హైదరాబాద్ లో డెంగీతోపాటు పలు జ్వరాలు విభృభించి కొంత మంది మృత్యువాత కూడా పడ్డారు. ఏకంగా తెలంగాణ హైకోర్టు కూడా హైదరాబాద్ లో దోమల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని..తీసుకున్న చర్యలు ఏంటో తమకు తెలియజేయాలని సర్కారును ఆదేశించింది. పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినా...ఏ ఇతర సందర్భంలోనూ స్పందించని మహేష్ బాబు సడన్ మంత్రి కెటీఆర్ ట్వీట్ చేయగానే బయటకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ ట్వీట్ చేస్తూ జ్వరాల బారిన పడకుండా..ముఖ్యంగా డెంగీ రాకుండా ఉండాలంటే నీటి తొట్టెలు, పూలకుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. తన ఇంట్లో ఆ పని తానే చేశానని కూడా కెటీఆర్ తెలిపారు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు.

దీనికి మహేష్ బాబు స్పందిస్తూ కెటీఆర్ కు మద్దతుగా ఆయన ఓ ట్వీట్ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి..నీరు నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి హైదరాబాద్ ప్రజలారా’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. కెటీఆర్ చెపితే తప్ప మహేష్ బాబు చెప్పరా?..ఫ్రీగా ఓ ట్వీట్ చేయటానికి కూడా కెటీఆర్ ట్వీట్ చేసే వరకూ మహేష్ బాబుకు తెలియదా?. లేదంటే కేవలం కెటీఆర్ ను సంతృప్తిపర్చేందుకు మాత్రమే ఆయన ట్వీట్ చేశారా?. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెటీఆర్ జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశం పెట్టి ఇక నుంచి సీజనల్ వ్యాధుల క్యాలెండర్ సిద్ధం చేసి..దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గత ఆరేళ్ళుగా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. గత తొమ్మిది నెలలు మినహా కెటీఆర్ కూడా మంత్రిగానే ఉన్నారు.

ప్రతి వర్షాకాలంలో సీజన్ లోనూ ముఖ్యంగా నగరంలో డెంగీ, ఇతర వైరల్ ఫీవర్లు ప్రజలపై దాడి చేయటం కామన్. అంటే ఆరేళ్ల పాటు జ్వరాల ప్లానింగ్ కూడా చేయలేరా?. వైరల్ ఫీవర్లపై ఓవైపు మీడియా, హైకోర్టు స్పందించినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ శాఖపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. మీడియా ఓ వైపు, విపక్షాల విమర్శల జోరు పెరిగాక మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం సమీక్షలు..ఆస్పత్రులను సందర్శించారు. ఈ సందర్భాల్లో ఎప్పుడూ స్పందించని హీరో మహేష్ బాబు కెటీఆర్ ట్వీట్ చేయగానే స్పందించటం ‘రాజకీయం’ కాక మరేమిటి?. ప్రజలను చైతన్యవంతం చేయాలంటే కెటీఆర్ ట్వీట్ చేసేవరకూ మహేష్ బాబుకు ఆ విషయం తెలియదా?.

Next Story
Share it