మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి
సీనియర్ నేత, మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి ఇక లేరు. ఆయన సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముత్యంరెడ్డి.. అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పదవులను అధిరోహించారు.
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో.. నిరాశ చెందిన ఆయన ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. ముత్యంరెడ్డి చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.