ఈఎస్ఐ డైరక్టర్ దేవికా రాణి అరెస్ట్

కలకలం రేపిన మందుల కొనుగోలు కుంభకోణంలో ఈఎస్ఐ డైరక్టర్ దేవికా రాణిని ఏసీబీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. ఏసీబీ విచారణలో పలు అక్రమాలు వెలుగు చూడటంతో ఈఎస్ఐ డైరక్టర్ తో పాటు పలువురు అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దేవికా రాణిని షేక్పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ అధికారులు గురువారం నాడంతా దేవికా రాణి కార్యాలయంలో తనిఖీలు జరిపారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ, సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్తో పాటు వరంగల్లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎమ్ఎస్) విభాగంలోని అవీనీతి జరిగిన కుంభకోణం వెల్లడైంది. ఏసీబీ అధికారులు దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించారు.
ఐఎమ్ఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్ఎస్ ఉద్యోగులు, మెడికల్ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ ఏసీబీకి లేఖ రాసారు. ముందుగా విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్రెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది.