పీవోకె భారత్ లో అంతర్భాగమే

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దూకుడు పెంచారు. గత కొంత కాలంగా పాక్ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. పాక్ హెచ్చరికల నేఫథ్యంలో భారత్ ఇప్పటి వరకూ పాటించిన అణ్వస్త్రాల ను ముందుగా ఉపయోగించం అన్న అంశాన్ని అవసరమైతే సమీక్షిస్తామని ప్రకటించి కలకలం రేపారు. అణ్వస్త్రాలపై అవసరాలను బట్టి తమ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా లడ్డాక్ లో పర్యటించిన రాజ్ నాథ్ పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకె) భారత్ లో అంతర్భాగమే అని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులను పెంచి పోఫిస్తున్న పాక్ తో ఏమి చర్చలు జరుపుతామని ప్రశ్నించారు. ముందు పాక్ ఉగ్రవాదులను ఆటకట్టించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాశ్మీర్ వ్యవహారంలో నిరాధార వ్యాఖ్యలు చేయరాదని పాకిస్తాన్ను ఆయన గురువారం హెచ్చరించారు.
గిల్గిత్-బల్టిస్తాన్ను పీఓకేతో పాటు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. కాశ్మీర్ లోయ మొత్తం భారత్లో భాగమని 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, దీనిపై తమ వైఖరి స్పష్టమని ఆయన పేర్కొన్నారు. భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పాటైందని, అసలు కాశ్మీర్ పాకిస్తాన్తో ఎప్పుడు ఉందని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ఉనికిని తాము గౌరవిస్తామని, అలాగని కాశ్మీర్పై పాక్ ఇష్టానుసారం మాట్లాడటం సరైంది కాదని అన్నారు. పీఓకే ప్రజల మానవ హక్కులను పరిరక్షించేలా పాక్ వ్యవహరించాలని రాజ్నాథ్ సింగ్ లడ్డాక్ రాజధాని లీలో జరిగే కార్యక్రమంలో హాజరవుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.