పాక్ తో చర్చలు అంటే..ఇక పీవోకే పైనే

భారత్ దూకుడు పెంచుతోంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశంలో పెద్ద ఎత్తున మద్దతు పొందిన కేంద్రం పాక్ కు గట్టిగా సమాధానం చెబుతోంది. అంతర్జాతీయంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ప్రయోజనం పొందాలని చూసిన పాక్ కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటే ఇక అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కే పరిమితమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అది కూడా ఉగ్రవాదులకు పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఆదివారం హర్యానాలో జరిగిన జనాశీర్వాద్ ర్యాలీని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఆశించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
దీనిపై పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ఎదుట రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. బాలాకోట్ కంటే భారీ చర్యలకు భారత్ ఉపక్రమించిందని ఇటీవల పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాకోట్లో భారత్ జరిపిన చర్యలను పాక్ ప్రధాని గుర్తించినట్టు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ నిమిషాల వ్యవధిలో ఆర్టికల్ 370ను రద్దు చేసిందని, తాము ఎన్నడూ అధికార దాహంతో రాజకీయాలు చేయబోమని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించిన మేరకు ఆర్టికల్ 370ను రద్దు చేసి ఎన్నికల హామీని నెరవేర్చామని తెలిపారు.