బిజెపి చేతి నిండా డబ్బులే
కేంద్రంలోని అధికార బిజెపి పార్టీ దేశంలో అత్యంత క్యాష్ రిచ్ పార్టీగా మారింది. ఏకంగా ఇప్పుడు ఆ పార్టీ వద్ద 1483 కోట్ల రూపాయలు ఉన్నాయి. దేశంలో అత్యంత సంపన్న పార్టీగా బిజెపి అవతరించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో బిజెపి ఆస్తులు 22.27 శాతం పెరిగాయి. 2016-17లో రూ 1213.13 కోట్లుగా నమోదైన కాషాయ పార్టీ ఆస్తులు 2017-18లో రూ రూAs కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆస్తులు 15.26 శాతం మేర క్షీణించి రూ 854 కోట్ల నుంచి రూ 724 కోట్లకు తగ్గాయి.
ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో ఎన్సీపీ ఆస్తులు రూ 11.41 కోట్ల నుంచి రూ 9.54 కోట్లకు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వంటి ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులను ఏడీఆర్ పరిశీలించి..మదింపు చేసింది. ఏడు పార్టీలు ఈ రెండేళ్ల కాలానికి ప్రకటించిన ఆస్తుల్లో ఆరు శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఆస్తులు రూ 26.25 కోట్ల నుంచి రూ 29.10 కోట్లకు చేరాయి. ఇదే కాలానికి ఏడు రాజకీయ పార్టీల మొత్తం అప్పులు రూ 514 కోట్ల నుంచి రూ 374 కోట్లకు తగ్గడం విశేషం. 2017-18 సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ 324.2 కోట్ల రుణాలున్నట్టు ప్రకటించగా, బీజేపీ రూ 21.38 కోట్లు, తృణమూల్ రూ 10.65 కోట్లు అప్పులుగా చూపాయి.