‘కాశ్మీర్’ అంశంపై మాజీ క్రికెటర్ల మాటల యుద్ధం
ఇద్దరూ మాజీ క్రికెటర్లే. ఒకరు పాకిస్తాన్. మరొకరు భారత్. భారత్ మాజీ క్రికెటర్ ఇప్పుడు ఎంపీ కూడా. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు కాశ్మీర్ అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో వీళ్లిద్దరూ మైదానంలోనూ దూకుడు చూపిన వారే. అయితే ఇప్పుడు వీరి మాటల యుద్ధానికి ట్విట్టర్ వేదిక అయింది. ఈ వివరాలు ఏంటో మీరూ చూడండి. జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్పై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న అఫ్రిది వ్యాఖ్యలను గంభీర్ తనదైన శైలిలో సమాధానం ఇఛ్చారు. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కాశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతున్నా ఐరాస ఎందుకలా నిద్రపోతోంది.
కాశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన గంభీర్ ..‘అఫ్రిది.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని అంగీకరించిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏమిటంటే మానవ హక్కుల ఉల్లంఘన, స్వేచ్చ లేకపోవటం వంటివి అన్నీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం.’ అంటూ అఫ్రిదికి గంభీర్ కౌంటర్ ఇచ్చారు.