Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర బడ్జెట్ బాగా లేదు..ఇదీ వైసీపీ మాట

కేంద్ర బడ్జెట్ బాగా లేదు..ఇదీ వైసీపీ మాట
X

పాత్ర మారితే..మాటల మారిపోతాయా?. ప్రతిపక్షంలో ఉండగా కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం అసలేం బాగోలేదు అంటోంది. అప్పుడూ..ఇప్పుడు మాట్లాడింది విజయసాయిరెడ్డే. అప్పట్లో వైసీపీ వ్యాఖ్యలపై అధికారంలో ఉన్న టీడీపీ కూడా విమర్శలు చేసింది. విచిత్రంగా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై వైసీపీ విమర్శలు చేసింది. ఈ బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ అనంతరం విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదన్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగిందని వెల్లడించారు.

ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోలవరం, అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా రహస్యంగా చేస్తున్నారని ఆరోపించారు. మిగతా ప్రభుత్వరంగ సంస్థలను ఇబ్బంది పెట్టి ఎయిరిండియాకు నిధులు సమకూర్చడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎన్నారైలకు ఆధార్ కార్డు ఇవ్వడం అభినందించాల్సిన విషయమన్నారు.

Next Story
Share it