Telugu Gateway
Politics

టీఆర్ఎస్ సభ్యత్వం 50 లక్షలు

టీఆర్ఎస్ సభ్యత్వం 50 లక్షలు
X

నెల రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 50 లక్షల సభ్యత్వం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తెలిపారు. అదే సమయంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో సభ్యత్వం తీసుకునే వారికి కూడా ఈ బీమా స్కీమ్ కొనసాగుతుందని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. జూన్‌ 27 నుంచి జూలై 31 వరకూ 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించామని తెలిపారు. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.11 కోట్ల 21 లక్షల రూపాయలకు చెక్‌ ఇచ్చామని వెల్లడించారు. సభ్యత్వ కార్యక్రమంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కెటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు గతంలో కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. కొందరు గడ్డాలు కూడా తియ్యమని శపథాలు చేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు సమస్యలు దొరకడం లేదని.. అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లోనే వారికి సమాధానం చెబుతామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి తనకు తెలియదన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు. ప్రతిపక్షాలు సమస్యలు దొరక్క ఏదో ఒక అంశంపై మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. పురపాలక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it