జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యనిషేధం జగన్ వల్ల కాదన్నారు. దీని వల్ల చాలా దుష్పలితాలు వస్తాయని చెప్పారు. ‘పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. అది జరగదని జగన్ కూ తెలుసు. అందరికీ తెలుసు.అంచెలంచెలుగా మద్యపాన నిషేధం. ఎప్పుడు అంచెలంచెలు.ఎలా బతకాలి. ఏమి తాగాలి. ఏమి తినాలో నియంత్రించటం మొదలుపెడితే అందరూ ఎదురు తిరిగుతారు. చాలా ఆలోచించి చేయాలి ఇవన్నీ. రెస్సాన్సబులిటీతో చేయాలి. 70 శాతం మహిళలు మాకు ఇక్కడ మద్యం దుకాణాలు వద్దంటే తీసేయాలి. ప్రజల ఆమోదయోగ్యం లేకుండా ప్రభుత్వం ఓ విధానం తీసుకువస్తే సాధ్యం కాదు. పెన్షన్ 3000 రూపాయలు ఇస్తామన్నారు. సాధ్యపడదని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు 250 రూపాయలు పెంచారు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా? అలా చెపితే ఓట్లు వేయరని చెప్పలేదు.’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. తనకు స్వార్ధం లేదని..నిజంగా అది ఉంటే ఏదో ఒక పార్టీతో కలిసేవాడినని తెలిపారు. గతంలో కూడా కొంత మంది విలీన ప్రతిపాదన తెచ్చినా తాను అంగీకరించలేదన్నారు.
అసెంబ్లీ జరిగిన తీరును కూడా పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అక్కడ ఒక్క కొట్టుకోవటం తప్ప అన్నీ జరిగాయని విమర్శించారు. తాము ఆశయం కోసమే పనిచేస్తున్నామని..తమ దగ్గర డబ్బులేదని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు దేశం మొత్తం తమ వైపు చూసేలా చేస్తామన్నారు. చాలా మంది నేతలు తాను గెలిచి సీటును గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేవారని..అలా ఇవ్వటానికి రాష్ట్రం కేక్ ముక్కకాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాను ఓడపోవటం మంచిది అయిందని..దీంతో ఎవరు తన వాళ్లో కూడా తనకు స్పష్టత వచ్చిందని పవన్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి యువ అభ్యర్ధులతో కమిటీలు రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రతి సమస్య మీద ఓ కమిటీ వేస్తామని, ఆయా సమస్యల మీద అవగాహన ఉన్న వారికే బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఎవరికి కేటాయించిన సమస్యలపై వారు అధ్యయనం చేసి పార్టీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
బి.ఫారం ఇవ్వడం అంటే బాధ్యత ఇవ్వడమే. మీకు టిక్కెట్స్ ఇచ్చి వేరే పార్టీకి సహకరించానంటూ నేను నిందలు మోయాల్సి వచ్చింది. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే కొత్త వారికి అవకాశం ఇచ్చాం. మీలో ఎక్కువ మంది కొద్దిరోజుల ముందు పార్టీలోకి వచ్చారు. అందువల్లే ఓటమికి కారణాలపై నేను సమీక్షలు జరపడానికి ఇష్టపడలేదు. ఐదేళ్ల పాటు నాతో నడిచి ఓటమి పాలైతే ఎందుకు? ఏమిటి.? అని సమీక్షలు జరపాలి. అయితే మీకు సీట్లు ఇచ్చిన కారణంగా బలంలేని అభ్యర్ధులకు సీట్లు ఇచ్చాను అన్న మాట పడాల్సి వచ్చింది.
పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపుకి ఆ మాట తీసేయాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడాలు, కొట్లాటలే కనబడుతున్నాయి. ప్రజా సమస్యల మీద మాట్లాడే వారు కనబడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి. అందుకు ఎక్కడో ఒక చోటు అడుగు పడాలి. పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వలేక కాదు. అయినా మీ మీద నమ్మకంతో, మీరు నిలబడతారన్న నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టండి. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్ధులను తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఒక నియోజకవర్గానికి ఒక నాయకత్వం సరిపోదు.