Telugu Gateway
Politics

ఆ రాజీనామాలతో మాకు సంబంధం లేదు

ఆ రాజీనామాలతో మాకు సంబంధం లేదు
X

కర్ణాటక రాజకీయ డ్రామాపై బిజెపి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. వెనక నుంచి కథ అంతా నడిపిస్తూ పైకి మాత్రం తమకు అసలు దీంతో ఏ మాత్రం సంబంధం లేదని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలే దీనికి కారణం అని..ఆ పార్టీ సమస్యను తమపై నెడితే ఎలా అంటూ బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలోనే కర్ణాటకలో ప్రభుత్వం మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమకేమీ సంబంధం అని ప్రశ్నించారు.

తమ పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వెనుక బీజేపీ పాత్ర ఉందని, బీజేపీ వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై కిషన్‌రెడ్డి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో తమ పార్టీలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలిపారు. గతంలోనూ ఆ రెండు పార్టీలు బీజేపీపై ఇదేరకంగా నిందలు వేశారని, నాయకుడు లేని పార్టీ తరహాలో కాంగ్రెస్‌ తయారైందని పేర్కొన్నారు. తాము ఎవరిపైన కక్ష సాధింపుకు దిగబోమన్నారు.

Next Story
Share it