Telugu Gateway
Andhra Pradesh

ప్రతిపక్షంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతిపక్షంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే మైక్ లు కట్ అయ్యేవని..కానీ తమ ప్రభుత్వంలో మాత్రం అలాంటి ఏమీ ఉండదన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఏమి మాట్లాడినా వారికి సమాధానం ఇస్తామని వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుందన్నారు. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు. కానీ తాను అలా చేయనని చెప్పానని, పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. ఇక్కడ గతంలో ఎక్కడా అనర్హత వేటు వేయలేదని, రాజీనామాలు చేయించలేదని, వీటిని భిన్నంగా ఉండాలంటే మనం మార్గదర్శకంగా ఉండాలన‍్నారు. చంద్రబాబు గురించి చెప్పేముందు ఒక్క మాట కూడా చెప్పాలని, చంద్రబాబుకు అబద్దాలు చెప్పే అలవాటు ఉందని.. గతంలో అందరికి గుర్తు ఉండే ఉంటుందని, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నకిలీ డాక్యుమెంటరీ తీసుకొచ్చారని, అసెంబ్లీలో నాన్నకు కూడా అర్థం కాలేదని, ఏంటి అని గమనిస్తే..ఆ డ్యాకుమెంట్‌ నకిలీ అని గుర్తించారని అన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో నాన్న ఒరిజినల్‌ డాక్యుమెంట్ ఎందుకు చూపించావు అంటే..ఆయన అబద్ధాలు చెప్పారన్నారు. ఇలా అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెబుతానని చంద్రబాబు ఒప్పుకున్నారని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. అలాంటి తప్పుడు పని ఈ అసెంబ్లీలో సభ్యులెవరూ చేయకూడదని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సభలో మోసాలు, అబద్ధం చెప్పే కార్యక్రమం ఉండకూడదని, సభలో తప్పు చేయొద్దని, అవాస్తవాలు చెప్పొద్దని ముఖ్యమంత్రి సూచిస్తూ...చర్చ జరిగే అంశంపై పూర్తి అవగాహనతో రావాలన‍్నారు. సభ్యులు సమావేశాలకు గైర్హాజరు కావద్దని కోరారు.

అసెంబ్లీ ప్రారంభం కంటే కనీసం 30 నిమిషాలు ముందు ఉండాలని, ప్రతి పదిమంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలను సమన్వయం కోసం కేటాయిస్తామన్నారు. ఈసారి హుందాగా సభ నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. చట్టాలు చేసే సభలో ప్రతి చట్టాన్ని గౌరవిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. స్పీకర్‌ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని తెలిపారు.

Next Story
Share it