Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు హయాంలో ప్రచారం పీక్..మేటర్ వీక్

చంద్రబాబు హయాంలో ప్రచారం పీక్..మేటర్ వీక్
X

ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అంటే ప్రచారం పీక్..మేటర్ వీక్ అన్న చందంగా ఉందని ప్రజలు చెప్పారని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి వచ్చి చివరకు రాజమౌళికి ఈ బాధ్యత అప్పగించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోని పథకాలు చూస్తే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. వనం-మనం, నీరు చెట్టు, దోమలపై దండయాత్ర, మీ ఇంటికి మీ భూమి, హ్యాపీ సండే, జలహారతి పథకాలను ప్రస్తావించారు. టెలికాన్ఫరెన్స్ లు పెట్టి ఆదివారం నాడు కూడా ఉధ్యోగులను ఇబ్బంది పెట్టి హ్యాపీ సండే అంటే ఎలా అని ప్రశ్నించారు. దోమలపై దండయాత్ర ఏంటో అర్ధం కాలేదని..అది ఏమైందో కూడా తెలియదని విమర్శించారు.

టీడీపీ హయాంలో నీరు చెట్టు కార్యక్రమానికి 793 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి..4850 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని..ఈ నిధులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి కన్ఫ్యుజన్‌ లేదని బుగ్గ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్‌లో భారీ ఎత్తున ఉంటాయని బుగ్గన వెల్లడించారు. యువజన క్రీడా సర్వీసుకు రూ. రెండువేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పి.. కేవలం రూ. 200 కోట్ల మాత్రమే గత ప్రభుత్వ ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు.

రాజధాని నిర్మాణం కొరకు గత ఐదేళ్లలో రూ. 1700 ​కోట్లు ఖర్చు చేస్తే.. అందులో సగానికి పైగా కేంద్రమే ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించిందని వెల్లడించారు. ‘‘రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించాం. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవు. చిన్న చినుక పడినా భవనాల్లోకి వర్షం నీరు వస్తోంది. అమ్మబడి పథకానికిరూ. 6556 కోట్లు కేటాయించాం. ప్రతిపక్షం దానిపైన కూడా విమర్శలు చేస్తోంది. బడ్జెట్‌ను పూర్తిగా చదివితే మా ప్రాధాన్యతలు అర్థమవుతాయి. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పారిశ్రామికరంగం, సాగునీరు, వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశాం. తొలి బడ్జెట్‌లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఐదేళ్లలో టీడీపీ రూ.96 కోట్లు కేటాయిస్తే.. తాము తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించాం అని తెలిపారు.

Next Story
Share it