కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం
సస్పెన్స్ కు తెరపడింది. బిజెపి రంగంలోకి దిగింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది నాలుగోసారి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంతో రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో ఇప్పుడు కొంత అంకానికి తెరలేచినట్లు అయింది. పార్టీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా రాజ్భవన్కు చేరుకున్న యెడియూరప్ప చేత.. గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు.
బీజేపీ బలనిరూపణ చేసుకున్న తర్వాతే మంత్రివర్గ ఏర్పాటు జరగనుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, కాంగ్రెస్ అసంతృప్త నేత రోషన్ బేగ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. ఇక ప్రమాణస్వీకారం నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు యడ్యూరప్ప తన పేరును యెడియూరప్పగా మార్చుకున్నారు.