Telugu Gateway
Telangana

వాసవి..శ్రీనిధి కాలేజీలకు సుప్రీం షాక్

వాసవి..శ్రీనిధి కాలేజీలకు సుప్రీం షాక్
X

రాష్ట్రంలోని కాలేజీల ఫీజులను నియంత్రించే అధికారం ఖచ్చితంగా అడ్మిషన్ ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్ సీ)కి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల నియంత్రణ విధానంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు సమర్ధించింది. కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసే అధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సీ)దే అని పేర్కొంది. ఫీజులను పెంచుతూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు.. వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించింది. అయితే ప్రవేశాల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉండాలన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు తన పరిధి మీరి వ్యవహరించిందని అభిప్రాయపడింది. ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజీ పేరెంట్స్‌ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ఏఎఫ్ఆర్ సీ నియామకం చేపట్టింది. అయితే ఇప్పటికే కొన్ని కాలేజీలు తమ ఇష్టానుసారం ఫీజులు పెంచి వసూళ్ళు చేశాయి. అయితే సుప్రీం తీర్పు పలు కాలేజీల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట పడటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it