శివాజీ పాస్ పోర్టు సీజ్
గత కొంత కాలంగా సైలంట్ అయిపోయిన టీవీ9 విక్రయ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నటుడు, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సన్నిహితుడు శివాజీని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్ తన వాటాను దురుద్దేశపూరితంగా శివాజీకి పాత తేదీలో బదిలీ చేయించి ఎన్ సిఎల్ టీలో కేసు వేయించారని అలందా మీడియా ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై కేసులు కూడా దాఖలు అయ్యాయి. అప్పటి నుంచి కన్పించకుండా పోయిన శివాజీని బుధవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు అయింది.
శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్పోర్టును సైబర్ క్రైం పోలీసులు సీజ్ చేశారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.