ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మూడు సీట్లనూ దక్కించుకుంది. దీంతో తెలంగాణలో మరోసారి తన పట్టు నిరూపించుకున్నట్లు అయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసినా అవేమీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. సోమవారం ఉదయమే ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయాన్ని కైవసం చేసుకుంది. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కే దక్కాయి. నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై గెలుపొందారు.
చిన్నపరెడ్డికి 640, లక్ష్మికి 414 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (850) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంగాల వెంకట్రామిరెడ్డి(23)పై ఆయన 827 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ నెల 31న జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి 98.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,799మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు గాను 2,753మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.