లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక
తొలి రెండు రోజుల సభ్యుల ప్రమాణ స్వీకారం. మూడవ రోజుతో స్పీకర్ ఎన్నిక పూర్తయింది. ఓం బిర్లా లోక్ సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు సభలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నీ ఇంచుమించు మద్దతు తెలిపాయి. బుధవారం సభ ప్రారంభం స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రకటించారు. అంతకు ముందు ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ బలపరిచారు. ఓం బిర్లాను స్పీకర్ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, వైఎస్సార్సీపీ నేత మిథున్రెడ్డి, ఇతర పార్టీ నాయకులు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఓం బిర్లా ఆశీనులవుతున్న సమయంలో ‘భారత్ మాతాకీ జై’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు.
తర్వాత ప్రధాని మోదీ మట్లాడుతూ.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక లోక్సభకు గర్వకారణమని అన్నారు. ఓం బిర్లా రాజస్థాన్లో బాగా పనిచేసిన విషయం చాలా మంది ఎంపీలకు తెలుసని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి పనిచేశానని వెల్లడించారు. మినీ ఇండియాగా పేరుగాంచిన రాజస్థాన్లోని కోట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన నిర్విరామంగా సమాజసేవలో నిమగ్నమయ్యారని ప్రశంసించారు. అధిర్ రంజన్ చౌధురి కూడా స్పీకర్ అభినందిస్తూ మాట్లాడే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సభ దృష్టిని ఆకర్షించారు.