తెలంగాణ కొత్త సచివాలయానికి శంకుస్థాపన
తెలంగాణకు త్వరలోనే కొత్త సచివాలయం..కొత్త అసెంబ్లీ రాబోతున్నాయి. ఈ భవనాలకు ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇవి సిద్ధం కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు హాజరయ్యారు.
నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరగనుంది. అనంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్అండ్బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 100కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ అసెంబ్లీ భవన నిర్మాణం జరగనుంది. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.