Telugu Gateway
Andhra Pradesh

అడ్డ‌గోలు పీపీఏలు..చంద్ర‌బాబుపై చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం

అడ్డ‌గోలు పీపీఏలు..చంద్ర‌బాబుపై చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అడ్డ‌గోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల‌పై చ‌ర్య‌ల‌కు స‌ర్కారు సిద్ధ‌మైంది. అంతే కాదు..స‌ర్కారుకు ఖ‌జానాకు భారీ ఎత్తున న‌ష్టం చేకూర్చిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోపాటు అప్ప‌టి విద్యుత్ శాఖ మంత్రి, కార్య‌ద‌ర్శిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. విద్యుత్ పీపీఏల‌తో పాటు 30 అంశాల‌పై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేసి అక్ర‌మాల నిగ్గుతేల్చాల‌ని నిర్ణ‌యించారు. సోలార్,విండ్ పవర్ సంస్థల నుంచి కాంపిటిటివ్ బిడ్డింగ్ రేట్ల కన్నా అదిక ధర పెట్టి ఎందుకు విద్యుత్ ను కొనుగోలు చేశారని జగన్ రివ్యూ మీటింగ్ లో అధికారుల‌ను ప్రశ్నించారు.దీనివల్ల 2636 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అదికారులు వెల్లడించారు.

సోలార్ విండ్ పవర్ సంస్థల తో సంప్రదింపులు జరిపి, దరలు తగ్గించేలా చూడాలని,లేకుంటే ఒప్పందాలు రద్దు చేయాలని జగన్ అబిప్రాయపడ్డారు. ఇందుకోసం ఒక కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన వివిద అవినీతి ఆరోపణలపై విచారణ చేయడానికి గాను ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి, అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చేందుకు ఎసిబి, సిఐడి, విజిలెన్స్ ఎన్ పోర్స్ మెంట్ వంటి శాఖల సహకారం తీసుకుని ఈ విచారణ సాగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందని జగన్ అబిప్రాయపడ్డారు.

Next Story
Share it