అప్పులపై ఏపీ వడ్డీ చెల్లింపులు 15 వేల కోట్లుపైనే
అప్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏటా చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా?.. ఆ మొత్తం వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అప్పులపై వడ్డీ కింద ఏపీ సర్కారు 15077 కోట్ల రూపాయలు చెల్లించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ ఆంధ్రప్రదేశ్పై రూ.2,49,435 కోట్ల రుణభారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2015 మార్చి నెలాఖరు దాకా రాష్ట్రంపై రూ.1,48,743 కోట్ల అప్పులు ఉండగా... 2017 మార్చి నెలాఖరుకు ఇది రూ.2,01,314 కోట్లకు చేరిందని తెలిపారు.
డిస్కమ్ల అప్పులను టేకోవర్ చేయడానికి వీలుగా ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఒకసారి అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతించామని, అందులో ఉదయ్ పథకం కింద 2016-17లో రూ.8256 కోట్ల అదనపు రుణం తీసుకోడానికి ఆంధ్రప్రదేశ్కు అనుమతించామని స్పష్టం చేశారు. 2016-17లో రెవెన్యూ లోటు కింద రూ.1176.5 కోట్లు, వెనుకబడిన జిల్లాల కోసం రూ.350కోట్లు, రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.450కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2514.7 కోట్లు విడుదల చేశామని నిర్మలా సీతారామన్ వివరించారు.