Telugu Gateway
Politics

వైసీపీ సంచలన నిర్ణయం

వైసీపీ సంచలన నిర్ణయం
X

సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్న వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 25 లోక్ సభ సీట్లలో 22 సీట్లు దక్కించుకున్న ఈ పార్టీ ఇప్పుడు మరో సీట్లకు సంబంధించిన కౌంటింగ్ పై కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అయింది. అవి గుంటూరు, శ్రీకాకుళం లోక్ సభ స్థానాలు. ఈ గుంటూరులో టీడీపీ తరపున గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ లో గోల్ మాల్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే అంశంపై వీరు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

మొత్తం నమోదైన పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను లెక్కించగా వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. 13 (ఎ) ద్వారా నమోదైన పోస్టల్ ఓట్లకు సంబంధించి 13 (బి) కవర్ పైన నంబర్ వేయలేదంటూ తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. శ్రీకాకుళం సిట్టింగ్‌ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్‌ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి.

Next Story
Share it