Telugu Gateway
Politics

పవన్ కళ్యాణ్ కు క్లారిటీ వచ్చిందా?

పవన్ కళ్యాణ్ కు క్లారిటీ వచ్చిందా?
X

హోరా హోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేనకు మహా వస్తే రెండు..లేదా మూడు సీట్లకు మించి రావనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులతో సమావేశంలో అయ్యారు. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఎన్ని సీట్లు కాదు..ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ముఖ్యం అన్నారు. సీట్ల పరంగా జనసేన పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు కానీ..ఓట్ల శాతం మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో దక్కించుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత ఏంటి అనే సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దని అన్నారు. "పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం ఎలా ఉంటుందనే భ‌యం లేదు.

ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్ట‌లేదు. ఎంత పోరాటం చేశామ‌న్న అంశం మీదే నా ఆలోచ‌న‌. మార్పు కోసం మ‌హిళ‌లు చాలా బ‌లంగా నిల‌బ‌డ్డారు. గెలుస్తారా.? లేదా.? అన్న అంశం ప‌క్క‌న‌పెట్టి భ‌య‌ప‌డ‌కుండా వ‌చ్చి ఓట్లు వేశారు. పొలిటిక‌ల్ ప్రాసెస్‌లో స‌హ‌నం, ఓపిక అవ‌స‌రం. గుండె ధైర్యం కావాలి. అంతా క‌న్వెన్ష‌న‌ల్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజ‌కీయాలు చేయ‌ను. డ‌బ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఓట‌మి లోతుల నుంచి బ‌య‌టకు వ‌చ్చాను. నాకు నిగ్ర‌హం-నియ‌మం ఉన్నాయి. ఎన్నో అవ‌మానాలు, వెట‌కారాలు భ‌రించాను. 2014లో జ‌న‌సేన పార్టీ స్థాపించే స‌మ‌యంలో ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న ఆలోచ‌న చేయ‌లేదు. ఎక్క‌డో ఒక చోట మార్పు రావాలి అని మాత్ర‌మే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్ట్‌ గా ఇస్తామంటున్నారు. ప్ర‌జాస్వామ్యంలో అలాంటి ప‌దాల‌కు తావులేదు. అంతా పార్టీ నిర్మాణం జ‌ర‌గాలి అని స‌ల‌హాలు ఇస్తున్నారు. అది అంత తేలిక ప్రక్రియ కాదు.

అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్ర‌ట‌రీ, వారికి అది అని ఇచ్చే ప‌ద‌వులు ఇవ్వడం కాదు పార్టీ నిర్మాణం అంటే. కొత్త‌తరాన్ని త‌యారు చేస్తున్నాం. అంతా ఓ భావ‌జాల‌నికి అల‌వాటుప‌డాలి. నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్నాం. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు లీడ‌ర్స్ లేరు. జ‌న‌సైనికులు మాత్ర‌మే ఉన్నారు. అదే జ‌న‌సైనికులు కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త రూపంలో మీ వెంట ఉన్నారు. అంతా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే యువ‌త‌. వారికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్ప ఎవ‌రూ తెలియ‌దు. ఎవ‌రి మాట విన‌రు. ఇదంతా ముడి స‌రుకు. దాన్ని శుద్ధి చేయాలి, సాన‌బ‌ట్టాలి. అందుకు నిబ‌ద్ద‌త అవ‌స‌రం. స్థానిక స‌మ‌స్య‌ల మీద, స్థానిక ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టండి. మార్పు మొద‌లైంది. అది మ‌న గెలుపు. మార్పు అన్న‌ది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్న‌ది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి" అని అన్నారు.

Next Story
Share it