మోడీ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. అసలు ఎన్డీయేకే మెజారిటీ రాదని విపక్షాలు ధీమా వ్యక్తం చేస్తే..మోడీ ఏకంగా సొంతంగానే 303 సీట్లు దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం తన పనిలో తాను ఉన్నారు. ఈ నెల30న రెండవ సారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయటానికి రెడీ అయిపోయారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్...మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు మోడీ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు.