Telugu Gateway
Politics

మోడీ..రెండో సారి

మోడీ..రెండో సారి
X

నరేంద్రమోడీ రెండవ సారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి పలువురు విదేశీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీంతో కేంద్రంలో వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కార్‌ కొలువు తీరినట్లు అయింది. మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్ షాలు ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతోపాటు కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గురువారం ప్రమాణం చేయించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జెడీయూ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరటంలేదని ప్రకటించింది. ఒక్క మంత్రివర్గ బెర్త్ మాత్రమే ఇస్తామనటం నితీష్ కుమార్ అలక బూనారు. తాము ఎన్డీయేలో కొనసాగుతామని..ప్రభుత్వంలో మాత్రం ఉండబోమని ప్రకటించారు. రాబోయే రోజుల్లో సర్దుబాటు చేసుకుంటారా? లేక అలాగే వదిలేస్తారా? అన్న సంగతి తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it