దీక్ష విరమించిన లక్ష్మణ్
![దీక్ష విరమించిన లక్ష్మణ్ దీక్ష విరమించిన లక్ష్మణ్](http://telugugatewaysite.vocalwire.com/wp-content/uploads/2019/05/k-laxman.jpg)
తెలంగాణలో బిజెపి దూకుడు పెంచింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే స్పీడ్ గా సర్కారుపై పోరాటానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా ఇంటర్ బోర్డు వైఫల్యాలపై బిజెపి స్పీడ్ గా స్పందించింది. బిజెపి నాయకులతో పాటు కార్యకర్తలు..విద్యార్ధి విభాగాలు కూడా రోడ్డెక్కాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్ను అదేరోజు అరెస్ట్ చేసిన పోలీసులు నిమ్స్ కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. లక్ష్మణ్ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు.