కవిత కోసం రాజీనామా చేస్తా
నిజామాబాద్ లో తెలంగాణ సీఎం కెసీఆర్ కుమార్తె కవిత ఓటమి ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కెసీఆర్ కవితకు ఎప్పుడు...ఏ పదవి అప్పగిస్తారని అన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కొంత మంది అయితే ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత కోసం తాను పదవీ త్యాగం చేస్తానని చెప్పారు. జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవితను కోరుతానని తెలిపారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో అదిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె 70 వేల 875 ఓట్ల తేడాతో కవిత ఓటమి చవిచూశారు. ఇప్పుడు కవితకు పదవి అన్నది టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.