‘నేను విఫలం కాలేదు’..కెటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాను విఫలమయ్యాయని అనుకోవటంలేదన్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు పదహారు సీట్లు గెలిచినా కేంద్రంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక లోక్ సభ ఎన్నికల ఫలితాలపై లోతైన సమీక్ష చేస్తామని తెలిపారు. హరీష్ రావును ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనటం సరికాదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో కవిత ఓటమికి రైతులు కారణం కాదన్నారు. అక్కడ నామినేషన్ వేసింది రైతులు కాదు..రాజకీయ కార్యకర్తలు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు వల్లే కవిత ఓడిపోయారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరటం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయనటం కూడా సరికాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా టీఆర్ఎస్ లో చేరలేదని చెప్పారు. ఆదిలాబాద్ సీటు గెలుస్తామని బిజెపి కూడా ఊహించి ఉండదన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ వంటి వారే ఓడిపోయారు. ఇలాంటి ఫలితాలు అసలు ఊహించలేదన్నారు. ఎంపీ అభ్యర్ధుల ఎంపిక సరిగాలేదనటం కూడా కరెక్ట్ కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు నాలుగు లక్షల ఓట్లు తగ్గాయన్నారు . మల్కాజ్గిరిలో కాంగ్రెస్పార్టీ వెంట్రుక వాసిలో గెలుపొందింది. రేవంత్ రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లాంటివే. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ మంచి సీట్లను గెలుచుకుంది. సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది.