పార్టీ మార్పులు వార్తలపై రేవంత్ ఆగ్రహం
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఈ వార్తలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను పార్టీ మారే ప్రశ్నేలేదన్నారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం, మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజిగిరిలో ప్రజలు తనని ఆశీర్వదించారన్నారు. కొడంగల్లో కేసీఆర్, హరీష్ రావు తనపై కుట్రలు చేసి ఓడించారని, కానీ ప్రశ్నించేవారు ఉండాలని రేవంత్ రెండ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటానని, వారికిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు.