Telugu Gateway
Politics

ఆంధ్రజ్యోతి ఎండీపై విజయసాయిరెడ్డి ఫైర్

ఆంధ్రజ్యోతి ఎండీపై విజయసాయిరెడ్డి ఫైర్
X

ఎన్నికల తర్వాత జైలుకు వెళ్ళే వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా ఉంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో టేప్ బహిర్గతం అంటూ ఆంధ్రజ్యోతి ఛానల్ లో ప్రసారం అయిన వార్తపై ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తను ప్రసారం చేసిన ఛానల్ పై సీఈసీతోపాటు ఏపీలోని ఎన్నికల ముఖ్య అధికారికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాదు ఆ ఆడియో టేపు ఎవరిదో తేల్చేందుకు పోలీసు కేసు కూడా పెడతానని తెలిపారు. తన వాయిస్ ఎలా ఉంటుందో మీడియా వాళ్లందరికీ తెలుసన్నారు. ఎన్నికల ముందు ఆడియో టేపుల పేరుతో కుట్ర చేశారని ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి సహకరించిన వారందరూ...ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళతారు. విశాఖలో ఓ గర్భిణిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారని చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే విశాఖ పోలీసులు కూడా మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినా, చంద్రబాబు మాత్రం ఇంకా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక లోక్‌నీతి సర్వే అంటూ బోగస్ ప్రచారం చేశారు. చివరికి లోక్‌నీతి సంస్థ కూడా ఆ సర్వే మాది కాదని ఖండించింది. దీంతో చంద్రబాబు, రాధాకృష్ణ మొహం మీద ఉమ్మినట్లు అయింది.

ఈ నాలుగున్నరేళ్లలో ఇంచుమించు రాధాకృష్ణ.. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలతో పాటు వివిధ రూపాల్లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరో 1500 కోట్లకు సెటిల్‌మెంట్లు చేశారు. పత్రికాముఖంగా చెబుతున్నా. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళతాడు. ఈరోజు.. ఆంధ్రజ్యోతిలో నేను మా పార్టీ అధ్యక్షుడిని కించపరిచేలా మాట్లాడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తూ ప్రోగ్రామ్‌ టెలీకాస్ట్‌ చేసింది. ఆంధ్రజ్యోతి.. ఒక కులజ్యోతి పత్రిక మాత్రమే. ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తోంది. గతంలో రాధాకృష్ణ కిరోసిన్‌, రేషన్‌ బియ్యం దొంగ. ఒక దొంగకు ఇంతకన్నా మంచి ఆలోచనలు, ఐడియాలు వస్తాయా?. మానవతా విలువలు విడిచి...దుష్ప్రచారం చేస్తూ సమాజంలో మాట్లాడకూడనివి కూడా అసభ్యకరంగా ప్రసారం చేస్తున్నారు. చట్టపరంగా కూడా ముందుకు వెళతా. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే...నీ ఛానల్‌ టెలికాస్ట్‌ లో ...వాయిస్‌ను నాదని నిరూపించు. నా వాయిస్‌ అందరికీ తెలుసు. కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది. నిన్న లక్ష్మీపార్వతి, ఈరోజు నా మీద, రేపు ఇంకొకరిపై ఇలాంటి అసత్య ప్రచారాలే చేస్తాడు. గతంలో మందకృష్ణ మాదిగను బాడుగ నేతగా నువ్వు అభివర్ణించావు. ఇప్పుడు నువ్వు కాదా బాడుగ నేతవి. నువ్వు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న రాష్ట్ర సొమ్మును పైసాతో సహా కక్కిస‍్తాం అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 650కి పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు 36 పేజీల టీడీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని, అధికారం పోతుందనే భయంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it