Telugu Gateway
Politics

ఓట్ల కోసం నోట్ల వరద

ఓట్ల కోసం నోట్ల వరద
X

పార్టీ ఏదైనా పని అదే. కాకపోతే రాష్ట్రంలో ఒక్కో పార్టీకే ఐటి కష్టాలు. అది ఇప్పుడు దేశమంతటా సాగుతున్న ట్రెండ్. తమిళనాడులో ప్రస్తుతం ఓట్ల కోసం నోట్ల వరద పారిస్తున్నారు. కానీ కేవలం ఇప్పుడు అధికార పార్టీ ప్రత్యర్ధులు మాత్రమే టార్గెట్ గా మారుతున్నారు. అధికార పార్టీ మాత్రం సేఫ్. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎవరూ చూసి ఉండరు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్నో విచిత్రాలను పార్టీలే కాదు..ఓటర్లు కూడా చూస్తున్నారు. తమిళనాడులో ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా తేని జిల్లా ఆండిపట్టిలో ఈసీ, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 1.48 కోట్ల నగదు పట్టుబడింది. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మునేట్ర కజగం(ఏఎంఎంకే) నేత నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు.

వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్‌ పెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే సోదాలు మొదలు పెట్టారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ఏఎంఎంకే కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీఎంకే అభ్యర్థికి చెందిన రూ. 11.53 కోట్ల నగదు పట్టుబడటంతో వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it